1980-90ల కాలంలో తెలుగుతో పాటు దక్షిణాది చిత్రసీమలో తనదైన నటన, గ్లామర్తో అగ్ర కథానాయికగా వెలిగిన నటి మాధవి, కెరీర్ పీక్ స్టేజ్లో ఉన్నప్పుడే సినీ రంగానికి హఠాత్తుగా గుడ్బై చెప్పారు. ‘ఖైదీ’, ‘మరో చరిత్ర’, ‘మాతృదేవోభవ’ వంటి ఎన్నో అద్భుతమైన చిత్రాలతో ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న ఆమె జీవితాన్ని సూపర్ స్టార్ రజనీకాంత్ ఇచ్చిన ఒక ఆధ్యాత్మిక పుస్తకం పూర్తిగా మలుపు తిప్పింది. వెండితెరపై తిరుగులేని మహారాణిగా వెలుగుతున్న సమయంలో, ఆ పుస్తక పఠనం వల్ల ఆమెలో ఆధ్యాత్మిక చింతన పెరిగి, రంగుల లోకానికి దూరంగా ఒక సరికొత్త ప్రయాణానికి నాంది పలికింది.
పశ్చిమ గోదావరి జిల్లా వేలుపుచెర్ల గ్రామంలో జన్మించిన మాధవి అసలు పేరు కనక విజయలక్ష్మి. చిన్నతనం నుంచే భరతనాట్యం, హార్స్ రైడింగ్, కరాటేలో బ్లాక్ బెల్ట్ వంటి రంగాల్లో ప్రావీణ్యం సంపాదించిన ఆమెకు మొదట్లో సినిమాల్లో నటించాలనే కోరిక అస్సలు లేదు. రవీంద్రభారతిలో ఆమె నృత్య ప్రదర్శన చూసిన ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు ఆమెను ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ ‘మాధవి’గా పేరు మార్చారు. ఆ తర్వాత కమలహాసన్, రజనీకాంత్, మెగాస్టార్ చిరంజీవి వంటి టాప్ హీరోల సరసన నటిస్తూ సౌత్ ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా మారారు. తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో కలిపి సుమారు 300కి పైగా సినిమాల్లో నటించి నంది, జాతీయ అవార్డులను సైతం సొంతం చేసుకున్నారు.
కెరీర్ అత్యున్నత శిఖరాల్లో ఉన్న సమయంలో రజనీకాంత్ బహుమతిగా ఇచ్చిన ఆధ్యాత్మిక పుస్తకం చదివి మాధవి ఒక స్వామీజీని ఆశ్రయించారు. ఆ స్వామీజీ.. “అమెరికా నుంచి నా శిష్యుడు ఒకరు వస్తున్నాడు, అతడే నీకు కాబోయే భర్త” అని చెప్పడంతో, ఆయన సూచన మేరకు రాల్ఫ్ శర్మను వివాహం చేసుకున్నారు. వివాహం తర్వాత గ్లామర్ ప్రపంచానికి పూర్తిగా దూరమవ్వాలని నిర్ణయించుకున్న మాధవి, ఒక సాధారణ గృహిణిగా మారి కుటుంబ బాధ్యతలను భుజాన వేసుకున్నారు. ప్రస్తుతం ఆమె తన భర్త, ముగ్గురు కుమార్తెలతో కలిసి అమెరికాలోని న్యూజెర్సీలో ఎంతో సంతోషంగా, ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నారు.









