వైఎస్ జగన్ రాజకీయ యూ-టర్న్: ఎన్డీయే దూరం.. జాతీయ విపక్షాల వైపు అడుగులు?

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజకీయ వ్యూహాల్లో అనూహ్య మార్పు కనిపిస్తోంది. నిన్నటివరకు కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వానికి పార్లమెంట్‌లో అప్రకటిత మిత్రుడిగా ఉంటూ వివాదాస్పద బిల్లులకు సైతం మద్దతు ఇచ్చిన జగన్, ఇప్పుడు రూటు మార్చారు. రాష్ట్రంలో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఎన్డీయేలో కీలకంగా మారడంతో.. ఇకపై కేంద్రం నుండి తమ పార్టీకి రాజకీయ రక్షణ లభించదనే ఉద్దేశంతో ఆయన ఎన్డీయే నీడ నుంచి బయటకు రావడానికి సిద్ధపడుతున్నట్లు రాజకీయ విశ్లేషణలు స్పష్టం చేస్తున్నాయి.

ఈ రాజకీయ పునర్వ్యవస్థీకరణకు జగన్ ‘ఎస్ఐఆర్’ (SIR) ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను ప్రధాన అస్త్రంగా ఎంచుకున్నారు. అమరావతి వేదికగా జరిగిన వర్క్‌షాప్‌లో ఆయన మాట్లాడుతూ.. పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ, తమిళనాడులో ఎం.కే. స్టాలిన్ ఎదుర్కొన్న ఓట్ల తొలగింపు సమస్యలను ప్రస్తావించారు. ఏపీలోనూ జెన్యూన్ ఓటర్ల పేర్లను తొలగించే కుట్ర జరుగుతోందని నేరుగా అమిత్ షా పర్యవేక్షణలోని వ్యవస్థలను టార్గెట్ చేయడం ద్వారా, తాను యాంటీ-బీజేపీ (ఇండియా కూటమి) క్యాంపు వైపు మొగ్గు చూపుతున్నాననే బలమైన సంకేతాలను ఇచ్చారు.

ఈ వ్యూహం వెనుక కేవలం జాతీయ రాజకీయాలే కాకుండా, రాష్ట్రంలో పార్టీ ఉనికిని కాపాడుకునే పెద్ద స్కెచ్ కూడా కనిపిస్తోంది. ఘోర ఓటమితో కుంగిపోయిన వైసీపీ కేడర్‌లో “మన ఓట్లను దొంగిలిస్తున్నారు.. కాపాడుకుందాం” అనే నినాదంతో మళ్లీ పోరాట పటిమను నింపాలని జగన్ భావిస్తున్నారు. రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో వైసీపీ గనుక ఇండియా బ్లాక్ నేతలతో కలిసి కేంద్రానికి వ్యతిరేకంగా గళం విప్పితే, అది జాతీయ రాజకీయాల్లోనే ఒక అతిపెద్ద మార్పుగా మారనుంది. అయితే అటు ఎన్డీయే రానివ్వక, ఇటు ఇండీ కూటమి చేరనివ్వక జగన్ ఒంటరి అవుతారా లేదా అనేది వేచి చూడాలి.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు