అమెరికాలో వలసదారులకు శాశ్వత నివాస హోదా కల్పించే గ్రీన్ కార్డ్ నిబంధనల విషయంలో డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగం కీలక నిర్ణయం తీసుకుంటూ వెనక్కి తగ్గింది. గ్రీన్ కార్డ్ దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయడానికి వలసదారులు ఖచ్చితంగా తమ స్వదేశానికి వెళ్లాల్సి ఉంటుందని ఇటీవల అమెరికా సిటిజన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) చేసిన మార్గదర్శకాల ప్రకటన తీవ్ర గందరగోళానికి, ఆందోళనకు దారితీసింది. అయితే, ఈ నిబంధనలపై తాజాగా అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీ (DHS) వివరణ ఇస్తూ.. పాత విధానం ప్రకారమే దరఖాస్తుదారులు అమెరికాను విడిచి వెళ్లాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం వెలువడిన ఈ తాజా నిర్ణయం అమెరికాలో నివసిస్తున్న విదేశీ వలసదారులకు, ముఖ్యంగా చైనా తర్వాత అత్యధిక సంఖ్యలో ఉన్న భారతీయ సమాజానికి చాలా పెద్ద ఊరటగా మారింది.
గత మే 21న విడుదల చేసిన మార్గదర్శకాలపై హోమ్ల్యాండ్ సెక్యూరిటీ విభాగం స్పష్టత ఇస్తూ.. ఇది పెద్ద వ్యూహాత్మక విధాన మార్పు ఏమీ కాదని పేర్కొంది. గ్రీన్ కార్డ్ దరఖాస్తుదారుడు ప్రక్రియ ముగిసే వరకు అమెరికాలోనే ఉండి పూర్తి చేయాలా లేదా స్వదేశానికి వెళ్లాలా అనే తుది నిర్ణయం తీసుకునే విచక్షణాధికారం పూర్తిగా ఇమిగ్రేషన్ అధికారికి మాత్రమే ఉంటుందని వివరించింది. ఈ నిబంధన చాలా కాలంగా అమల్లోనే ఉందని, గత వారం జారీ చేసిన ఉత్తర్వుల ముఖ్య ఉద్దేశం కేవలం ఇమిగ్రేషన్ అధికారులకు ఉన్న ఆ విచక్షణాధికారాలను గుర్తుచేయడం మాత్రమే తప్పా కొత్తగా తెచ్చిన ఆంక్షలు కావని డీహెచ్ఎస్ (DHS) ప్రతినిధి వెల్లడించారు. దరఖాస్తుల పరిశీలన జరుగుతున్న సమయంలో కూడా వలసదారులు అమెరికాలోనే సురక్షితంగా కొనసాగవచ్చని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
అయితే, అధికారికంగా హోమ్ల్యాండ్ సెక్యూరిటీ ఈ వివరణ ఇచ్చినప్పటికీ, వలసదారులు ఎలాంటి ప్రత్యేక పరిస్థితుల్లో దేశాన్ని విడిచి వెళ్లాల్సి వస్తుందనే దానిపై పూర్తిస్థాయి స్పష్టత ఇంకా రాలేదని తెలుస్తోంది. వీసా గడువు ముగిసినా దేశంలోనే అక్రమంగా ఉండిపోవడం లేదా ఇతర ఇమిగ్రేషన్ నిబంధనల ఉల్లంఘనలను మాత్రం తాము నిశితంగా పరిగణనలోకి తీసుకుంటామని అధికారులు సూచనప్రాయంగా తెలిపారు. వైట్ హౌస్కు చెందిన ఒక సీనియర్ అధికారి ‘ది న్యూయార్క్ టైమ్స్’ పత్రికతో మాట్లాడుతూ.. ఈ పరిణామాలను ఒక సాధారణ పరిపాలనాపరమైన విషయంగా అభివర్ణించారు. ఏదేమైనప్పటికీ, దరఖాస్తుల కోసం మళ్లీ సొంత దేశాలకు ప్రయాణం చేయాల్సిన అవసరం లేదనే క్లారిటీ రావడంతో లక్షలాది మంది భారతీయ ఐటీ ఉద్యోగులు, వలసదారులు ఊపిరి పీల్చుకున్నారు.









