వైఎస్ చనిపోయి 17 ఏళ్లు అయ్యాక కూడా ఆరోపణలా?: పవన్ కల్యాణ్‌కు కేవీపీ బహిరంగ లేఖ!

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పాలనపై ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన విమర్శలపై కాంగ్రెస్ సీనియర్ నేత డాక్టర్ కేవీపీ రామచంద్రరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్ హయాంలో రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదని, ప్రజలు రోడ్డుపైకి రావాలంటేనే భయపడేవారంటూ పవన్ చేసిన వ్యాఖ్యలను తప్పుబడుతూ ఆయనకు ఒక ఘాటు బహిరంగ లేఖను సంధించారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌కు, ప్రస్తుత వైసీపీకి ఎలాంటి సంబంధం లేదని కేవీపీ స్పష్టం చేశారు.

వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పవన్ కల్యాణ్‌పై ఎలాంటి అక్రమ కేసులు పెట్టలేదని కేవీపీ గుర్తుచేశారు. నాడు వైఎస్సార్ కేసులు పెట్టమన్నారంటూ ఓ పోలీస్ అధికారి తనతో చెప్పినట్లు పవన్ అంటున్నారని, ఆ అధికారికి తక్షణమే లై డిటెక్టర్ పరీక్ష చేయించాలని ఆయన డిమాండ్ చేశారు. ఒకవేళ ఆ అధికారి చెప్పింది నిజమని తేలితే తాను తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.10 కోట్లు విరాళంగా ఇస్తానంటూ కేవీపీ ఒక బహిరంగ సవాల్ విసిరారు. మహానేత చనిపోయి 17 ఏళ్లు దాటిన తర్వాత కూడా ఇలాంటి ఆధారాలు లేని ఆరోపణలు చేయడం అవివేకమని మండిపడ్డారు.

తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఇంకా చాలా బలంగా ఉందనే విషయాన్ని పవన్ గుర్తుంచుకోవాలని కేవీపీ హితవు పలికారు. విభజన చట్టం ప్రకారం ఏపీకి రావాల్సిన ప్రయోజనాలను సాధించడం కోసం సీఎం చంద్రబాబుతో పాటు కేంద్ర ప్రభుత్వంపై పవన్ ఒత్తిడి తీసుకురావాలని సూచించారు. పాత కక్షలను తవ్వుకుంటూ కూర్చోకుండా, డిప్యూటీ సీఎంగా ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలని లేఖలో పేర్కొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు