ఆంధ్రప్రదేశ్లో ఖాళీ అయిన నాలుగు రాజ్యసభ స్థానాలకు ఎన్డీయే కూటమిలో సీట్ల పంపకాలు పూర్తయ్యాయి. ఈ సర్దుబాటులో భాగంగా తెలుగుదేశం పార్టీ (టీడీపీ) మూడు స్థానాల్లో, జనసేన ఒక స్థానంలో పోటీ చేయాలని కూటమి పెద్దలు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో జనసేన కోటాకు దక్కిన ఆ ఒక్క రాజ్యసభ స్థానానికి అభ్యర్థి ఎంపికపై ఆ పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కసరత్తు పూర్తి చేసినట్లు విశ్వసనీయ సమాచారం.
జనసేన అభ్యర్థిగా ప్రముఖ పారిశ్రామికవేత్త లింగమనేని రమేశ్ పేరును పవన్ కల్యాణ్ దాదాపు ఖరారు చేసినట్లు రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. చాలా కాలంగా ఆయన పేరును పరిశీలిస్తున్న పవన్.. కూటమి సీట్ల కేటాయింపు ముగియడంతో ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. దీనిపై ఈరోజు సాయంత్రమే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని సమాచారం.
లింగమనేని రమేశ్ ఏపీ వ్యాప్తంగా సుపరిచితులైన బిజినెస్ మ్యాన్. ఆయన ప్రసిద్ధ ‘లింగమనేని ఎస్టేట్స్’, ‘ఎల్ఈపీఎల్ (LEPL) గ్రూప్’ సంస్థలకు చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. గతంలో ప్రాంతీయ విమానయాన సంస్థ ‘ఎయిర్ కోస్టా’ను కూడా స్థాపించిన ఆయన, గతంలో టీడీపీ అధినేత చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా ఉండేవారు. ఇప్పుడు జనసేన తరఫున ఆయన పేరు తెరపైకి రావడంతో ఏపీ రాజ్యసభ ఎన్నికల రాజకీయం మరింత ఆసక్తికరంగా మారింది.









