ఎండను లెక్కచేయకుండా.. విశాఖ రోడ్లపై సీఎం చంద్రబాబు సైకిల్ సవారీ!

ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విశాఖపట్నంలో ఉత్సాహంగా సైకిల్ సవారీ చేశారు. పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు నగరంలోని ఆంధ్ర యూనివర్సిటీ (ఏయూ) గ్రౌండ్స్ నుంచి నోవాటెల్ హోటల్ వరకు నిర్వహించిన భారీ సైకిల్ ర్యాలీలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని స్వయంగా సైకిల్ తొక్కారు. ఎండ తీవ్రంగా ఉన్నప్పటికీ ఏమాత్రం అలసట లేకుండా మొత్తం 5.5 కిలోమీటర్ల దూరాన్ని ఆయన కేవలం 21 నిమిషాల 18 సెకండ్లలోనే పూర్తి చేయడం విశేషం.

ఈ సైకిల్ యాత్ర ఏయూ గ్రౌండ్స్‌లో ప్రారంభమై త్రీ టౌన్ పోలీస్ స్టేషన్, పోలమాంబ గుడి, వాల్తేరు, ఆర్కే బీచ్ రోడ్ మీదుగా సాగి నోవాటెల్ హోటల్ వద్ద ముగిసింది. ర్యాలీ పొడవునా రోడ్డుకు ఇరువైపులా నిలబడిన స్థానిక ప్రజలకు, అభిమానులకు చంద్రబాబు నవ్వుతూ అభివాదం చేస్తూ ముందుకు సాగారు. 70 ఏళ్లు పైబడిన వయసులోనూ ఆయన చూపిన ఈ శారీరక దారుఢ్యం, ఉత్సాహం అక్కడ ఉన్న వారందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి.

పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందనే సందేశాన్ని ఇస్తూ సాగిన ఈ ర్యాలీలో ముఖ్యమంత్రితో పాటు జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, విద్యార్థులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని సైకిళ్లు తొక్కారు. సైక్లింగ్ చేయడం వల్ల పర్యావరణానికి మేలు జరగడమే కాకుండా ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని, ప్రజలు తమ నిత్యజీవితంలో ఇలాంటి మంచి అలవాట్లను భాగం చేసుకోవాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు