విజయవాడ టు వారణాసి కేవలం 2 గంటల్లో.. ఆగస్టు 13 నుంచి సరికొత్త విమాన సర్వీస్!

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, ముఖ్యంగా ఆధ్యాత్మిక యాత్రికులకు ఇండిగో ఎయిర్‌లైన్స్ సంస్థ సరికొత్త తీపి కబురు అందించింది. విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (గన్నవరం) నుంచి ప్రముఖ పుణ్యక్షేత్రం వారణాసి (కాశీ)కి నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. రాబోయే ఆగస్టు 13 నుంచి ఈ లైనర్ అందుబాటులోకి రానుండగా.. ప్రయాణికుల సౌకర్యార్థం ఇండిగో సంస్థ ఇప్పటికే ఈ రూట్‌కు సంబంధించిన టికెట్ బుకింగ్స్‌ను కూడా అధికారికంగా ప్రారంభించింది.

ఈ సరికొత్త నాన్-స్టాప్ విమాన సర్వీసులు వారానికి మూడు రోజులు.. అంటే ప్రతి మంగళ, గురు, శనివారాల్లో ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయని ఎయిర్‌లైన్స్ ప్రతినిధులు వెల్లడించారు. షెడ్యూల్ ప్రకారం.. వారణాసి నుంచి మధ్యాహ్నం 3:55 గంటలకు బయలుదేరే విమానం సాయంత్రం 5:50 గంటలకు విజయవాడ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో సాయంత్రం 6:20 గంటలకు విజయవాడ నుంచి టేకాఫ్ అయి, రాత్రి 8:15 గంటలకు కాశీకి చేరుకుంటుంది. ఈ విమాన ప్రయాణ టికెట్ ధరలు సుమారు రూ. 6,500 నుండి రూ. 8,000 మధ్యలో ఉండే అవకాశం ఉంది.

రాజధాని అమరావతి ప్రాంతానికి కనెక్టివిటీ పెంచేలా ఏపీ ప్రభుత్వం కేంద్రంతో జరిపిన చర్చలు ఫలించడంతో ఈ కొత్త రూట్ ఖరారైంది. ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం విమానయాన రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు ‘ఏవియేషన్ పాలసీ 2026-2031’ని అమల్లోకి తెచ్చింది. దీని ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ప్రతి 150 కిలోమీటర్ల పరిధిలో ఒక విమానాశ్రయం ఉండేలా దగదర్తి, కుప్పం, శ్రీకాకుళం, నాగార్జునసాగర్ తదితర ప్రాంతాల్లో లో-కాస్ట్ ఎయిర్‌పోర్టులు, వాటర్‌డ్రోమ్స్ అభివృద్ధి చేయడమే కాకుండా.. దేశంలోని 25 ప్రధాన నగరాలకు, 10 అంతర్జాతీయ ప్రాంతాలకు కనెక్టివిటీ పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు