పవన్ కల్యాణ్ ఫామ్‌హౌస్ కబ్జానే, ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి: కల్వకుంట్ల కవిత డిమాండ్

హైదరాబాద్ శివార్లలోని జన్వాడ ప్రాంతంలో ఉన్న కోడి చెరువు కబ్జా ఆరోపణలపై తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను లక్ష్యంగా చేసుకుని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరిగేషన్ శాఖ అధికారిక రికార్డుల ప్రకారం అది స్పష్టంగా చెరువు శిఖం భూమి అని తేలిపోయిందని ఆమె పేర్కొన్నారు. గతంలో పవన్ కల్యాణ్ తాను చెరువును ఆక్రమించలేదని, ఒకవేళ అది రుజువైతే భూమిని ప్రభుత్వానికి రాసిస్తానని చేసిన సవాల్‌ను గుర్తు చేస్తూ, ఇచ్చిన మాట ప్రకారం వెంటనే ఆ స్థలాన్ని తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించాలని, అక్కడ అక్రమంగా వేసిన కంటైనర్లు, మట్టిని తొలగించాలని డిమాండ్ చేశారు.

తెలంగాణ ఎవరిదో ఒకరి తాతల, ముత్తాతల జాగీరు కాదని, ఇది 1,200 మంది అమరవీరుల త్యాగాలు, కోట్ల మంది సుదీర్ఘ పోరాటాల ఫలితంగా సిద్ధించిన ప్రజల గడ్డ అని కవిత స్పష్టం చేశారు. స్థానిక వనరులను, అస్థిత్వాన్ని దెబ్బతీస్తూ ప్రజల దృష్టిని మళ్లించేందుకు కొన్ని శక్తులు డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. తెలంగాణలో బీజేపీకి క్షేత్రస్థాయిలో సొంతంగా బలమైన నాయకత్వం లేదని, కేవలం కొన్ని ఓట్ల కోసమే పవన్ కల్యాణ్ వంటి పరాయి శక్తులను అడ్డం పెట్టుకుని రాజకీయం చేయాలని చూస్తోందని ఆమె ఎద్దేవా చేశారు.

రాష్ట్రంలో గత మరియు ప్రస్తుత పాలనను పోలుస్తూ ‘కేటీఆర్’ అనే మూడక్షరాలపై కవిత ఆసక్తికరమైన పొలిటికల్ పంచ్ వేశారు. “నాడు, నేడు.. ఎప్పుడైనా కేటీఆర్ పాలనే నడుస్తోంది” అని వ్యాఖ్యానించిన ఆమె, దానికి వినూత్న వివరణ ఇచ్చారు. నాడు ‘కేటీఆర్’ అంటే.. కేసీఆర్, తన్నీరు హరీష్ రావు, కేటీ రామారావు అని, వారు రాష్ట్ర అభివృద్ధి కోసం రాత్రింబగళ్లు కష్టపడ్డారని గుర్తుచేశారు. కానీ నేడు ‘కేటీఆర్’ అంటే.. కొండల్ రెడ్డి, తిరుపతి రెడ్డి, రేవంత్ రెడ్డి అని పేర్కొంటూ, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పాలనను పూర్తిగా కుటుంబ సభ్యుల చేతుల్లో పెట్టారని తీవ్రంగా విమర్శించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు