డ్రోన్ దాడులు జరిగినా వెనక్కి తగ్గలేదు.. రష్యా సదస్సులో నిబద్ధత చాటుకున్న మంత్రి లోకేష్

రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో కీలకమైన అంతర్జాతీయ ఆర్థిక సదస్సు ప్రారంభానికి ముందు ఉక్రెయిన్ డ్రోన్ దాడులతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇలాంటి భయానక పరిస్థితుల్లోనూ, ఆంధ్రప్రదేశ్ ఐటీ, పారిశ్రామిక శాఖ మంత్రి నారా లోకేష్ ఆ సదస్సుకు హాజరై తన నిబద్ధతను, ధైర్యాన్ని ప్రదర్శించారు. సదస్సు ప్రారంభానికి కొన్ని గంటల ముందు జరిగిన ఈ దాడుల వల్ల నగరం చుట్టూ హై-సెక్యూరిటీ అలర్ట్ ప్రకటించినప్పటికీ, భారతదేశం నుంచి హాజరైన ఏకైక రాష్ట్ర ప్రతినిధిగా లోకేష్ నిలిచారు.

సెయింట్ పీటర్స్‌బర్గ్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఫోరం (SPIEF) సదస్సులో పాల్గొనేందుకు లోకేష్ మాస్కో నుంచి ప్రయాణిస్తుండగా ఈ దాడుల సమాచారం అందింది. భద్రతాపరమైన సమీక్షలు జరిగినప్పటికీ ఆయన వెనక్కి తగ్గకుండా, ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారమే ముందుకు సాగారు. ప్రపంచవ్యాప్తంగా పోటీ పెరుగుతున్న తరుణంలో, ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిన పారిశ్రామికవేత్తలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలనే దృఢ సంకల్పంతోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

తీవ్రమైన భద్రతా హెచ్చరికల నడుమ సదస్సుకు చేరుకున్న లోకేష్, తన పర్యటనను యథావిధిగా కొనసాగించారు. పలువురు గ్లోబల్ ఇన్వెస్టర్లు, వ్యాపార దిగ్గజాలతో సమావేశమై ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న పెట్టుబడి అవకాశాలను, ప్రభుత్వ ప్రాధాన్యతలను వారికి వివరించారు. డ్రోన్ దాడుల వార్తలు ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేసినా, ఏపీ ప్రగతికి మరియు పారిశ్రామిక వృద్ధికి ఎలాంటి అంతరాయం కలగకూడదనే లక్ష్యంతో లోకేష్ చూపిన చొరవ అక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు