ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనితపై వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలపై రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాల్లో విమర్శలు ఎప్పుడైనా విధానపరంగానే ఉండాలి తప్ప, ఇలా వ్యక్తిగత దూషణలకు దిగడం సరైన పద్ధతి కాదని ఆయన హితవు పలికారు. మహిళలను లక్ష్యంగా చేసుకుని చేస్తున్న ఇటువంటి అభ్యంతరకర వ్యాఖ్యలను సమాజం ఎంతమాత్రం అంగీకరించబోదని ఆయన స్పష్టం చేశారు.
కూటమి నాయకులతో జరిగిన అంతర్గత సమావేశంలో పవన్ కల్యాణ్ ఈ అంశాన్ని తీవ్రంగా ఖండిస్తూ.. రాజకీయాల్లో ప్రజా సమస్యలపై మాట్లాడాలే తప్ప, మహిళల కట్టూబొట్టుపై, వారి వ్యక్తిగత విషయాలపై కామెంట్స్ చేసే స్థాయికి దిగజారడం కరెక్ట్ కాదని మండిపడ్డారు. గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలు కేవలం హోంమంత్రి అనితను మాత్రమే కాకుండా, సగటు మహిళలందరినీ కించపరిచేలా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలు చేస్తున్న ఇటువంటి దాడులను, వారి ఆలోచనా విధానాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని కూటమి (TDP-JSP-BJP) నేతలకు ఆయన సూచించారు.
రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్, శాంతిభద్రతల విషయంలో హోంమంత్రి అనితను విమర్శించే క్రమంలో.. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఇటీవల ఆమెపై కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హోంమంత్రికి రాష్ట్ర భద్రత కంటే తన ‘మేకప్’ పైనే శ్రద్ధ ఎక్కువ ఉందంటూ ఆయన చేసిన కామెంట్లు రాజకీయంగా తీవ్ర దుమారం రేపాయి. ఈ నేపథ్యంలోనే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందిస్తూ, ఇటువంటి సంస్కృతి రాజకీయాలకు ఏమాత్రం శ్రేయస్కరం కాదని గట్టి కౌంటర్ ఇచ్చారు.









