టర్కీలోని ఇస్తాంబుల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అదృశ్యమైన తెలంగాణ యువతి బొక్క రాజశ్రీ ఎట్టకేలకు సురక్షితంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లా, ఘట్కేసర్లోని ఎన్ఎఫ్సీ నగర్కు చెందిన రాజశ్రీ, అమెరికాలోని హ్యూస్టన్ నగరం నుండి హైదరాబాద్కు తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో జూన్ 14న కనెక్టింగ్ ఫ్లైట్ కోసం ఇస్తాంబుల్ ఎయిర్పోర్టుకు చేరుకున్న ఆమె, హ్యూస్టన్లో విమానం ఎక్కినప్పటి నుండి ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు అధికారులను ఆశ్రయించారు.
ఈ ఉదంతంపై తెలంగాణ ప్రభుత్వం తక్షణమే స్పందించి చర్యలు చేపట్టింది. యువతి ఆచూకీని వేగంగా కనుగొనాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు ఇస్తాంబుల్లోని భారత కాన్సులేట్ జనరల్ను కోరారు. ఇందులో భాగంగా స్థానిక పోలీసులు, విమానాశ్రయ అధికారులు, టర్కిష్ ఎయిర్లైన్స్తో భారత దౌత్య సిబ్బంది నిరంతరం సమన్వయం చేసుకోగా, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కేంద్ర విదేశాంగ శాఖతో సంప్రదింపులు జరిపి పర్యవేక్షించారు.
అధికారుల నిరంతర దౌత్య, పోలీస్ శోధన ఫలితంగా జూన్ 18న రాజశ్రీ ఆచూకీ లభ్యమైంది. ఆమె ప్రస్తుతం సురక్షితంగానే ఉందని ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి అధికారికంగా వెల్లడిస్తూ, ఈ ఆపరేషన్లో సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. గత కొన్ని రోజులుగా తీవ్ర ఆందోళనలో ఉన్న కుటుంబ సభ్యులు రాజశ్రీ క్షేమంగా ఉందనే వార్తతో ఊపిరి పీల్చుకున్నారు, అయితే ఆమె ఏ పరిస్థితుల్లో విమానాశ్రయంలో అదృశ్యమయ్యారనే పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.









