తెలంగాణ రాష్ట్రంలో డిజిటల్ రంగంలో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని భారతి ఎంటర్ప్రైజెస్ ఛైర్మన్ సునీల్ భారతి మిట్టల్ను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కోరారు. హైదరాబాద్లోని ఎంసీఆర్ హెచ్ఆర్డీ బోధీ పెవిలియన్లో జరిగిన ఈ మర్యాదపూర్వక భేటీలో సీఎం మాట్లాడారు. భాగ్యనగరాన్ని ప్రధాన కేంద్రంగా చేసుకొని ఎయిర్టెల్ డిజిటల్, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగాల్లో తమ కార్యకలాపాలను పెద్ద ఎత్తున విస్తరించాలని ఈ సందర్భంగా సునీల్ మిట్టల్కు సీఎం సూచించారు.
ఈ సమావేశంలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన పారిశ్రామిక సంస్కరణలు, అభివృద్ధి కార్యక్రమాలను సీఎం రేవంత్ రెడ్డి సుదీర్ఘంగా వివరించారు. దేశంలోనే తెలంగాణ పెట్టుబడులకు అత్యంత అనుకూల గమ్యస్థానంగా మారుతోందని ఆయన పేర్కొన్నారు. సాంకేతిక రంగంలో వస్తున్న మార్పులను అందిపుచ్చుకునేందుకు, ఈ సరికొత్త డిజిటల్ విప్లవంలో ఎయిర్టెల్ వంటి దిగ్గజ సంస్థ భాగస్వామ్యం కావడం ఎంతో అవసరమని సీఎం అభిప్రాయపడ్డారు.
ఇదే క్రమంలో విద్యా రంగంలో ప్రభుత్వం చేపడుతున్న విప్లవాత్మక మార్పులను కూడా ముఖ్యమంత్రి పంచుకున్నారు. పారిశ్రామిక అవసరాలకు తగ్గట్టుగా యువతకు అంతర్జాతీయ స్థాయి నైపుణ్యాలు అందించేందుకు ఏర్పాటు చేసిన ‘యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ’ విశిష్టతను వివరించారు. దీనితో పాటు రాష్ట్రంలోని ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా (ATCs) మారుస్తున్నామని, పాలిటెక్నిక్ కళాశాలలను ఆధునికీకరిస్తూ పరిశ్రమలకు అవసరమైన మానవ వనరులను ఇక్కడే సిద్ధం చేస్తున్నామని సునీల్ మిట్టల్కు సీఎం రేవంత్ రెడ్డి వివరించారు.









