జేఎస్‌డబ్ల్యూ స్టీల్ ప్లాంట్‌తో సీమ దశ మారిపోతుంది: మంత్రి నారా లోకేశ్..

రాయలసీమ ప్రజల దశాబ్దాల కల అయిన కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణంలో మరో చారిత్రాత్మక అడుగు పడిందని రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం క్షేత్రస్థాయిలో పనులను వేగవంతం చేశామని ఆయన శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. ఈ ప్రాజెక్టు ద్వారా రాయలసీమ రూపురేఖలు మారనున్నాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇదే క్రమంలో విజయనగరంలో జేఎస్‌డబ్ల్యూ పారిశ్రామిక పార్కు పనులను కూడా ప్రారంభించినట్లు పేర్కొన్నారు.

 

జమ్మలమడుగు నియోజకవర్గంలోని సున్నపురాళ్లపల్లి వద్ద 2 మిలియన్ టన్నుల సామర్థ్యంతో జేఎస్‌డబ్ల్యూ గ్రీన్ స్టీల్ ప్లాంట్, 350 మెగావాట్ల సామర్థ్యంతో జేఎస్‌డబ్ల్యూ నియో ఎనర్జీ ప్లాంట్ పనులకు ఇవాళ సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టడం తెలిసిందే. దీనిపై లోకేశ్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రాజెక్టుల ద్వారా వేలాది మంది స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని, రాయలసీమ ప్రాంతం ఒక ప్రధాన పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు.

 

ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి పథంలో నిలపాలన్న కూటమి ప్రజా ప్రభుత్వ ఉక్కు సంకల్పానికి ఈ స్టీల్ ప్లాంట్ నిదర్శనమని లోకేశ్ అభివర్ణించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలో ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’తో రాష్ట్రాన్ని మళ్లీ ప్రగతి పథంలో నిలుపుతామని ఆయన స్పష్టం చేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు