హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ (CURE) పరిధిలో అర్హులైన పేదలకు కేటాయించే ఇందిరమ్మ ఇళ్లను జనావాసాల మధ్యనే నిర్మించాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నగరానికి దూరంగా ఇళ్లను నిర్మిస్తే ఉపాధి అవకాశాలు దూరమవుతాయని, ప్రజలకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.
ఔటర్ రింగ్ రోడ్ (ORR) లోపల ఉన్న ఖాళీ ప్రభుత్వ భూములను గుర్తించి గృహ నిర్మాణానికి వినియోగించాలని సీఎం సూచించారు. అలాగే పోలీస్, రెవెన్యూ, రవాణా తదితర శాఖల వద్ద ఉన్న ఖాళీ స్థలాలను సేకరించి, అవసరమైతే ఆయా శాఖలకు ప్రత్యామ్నాయ భూములు కేటాయించాలని అధికారులకు మార్గదర్శకాలు జారీ చేశారు.
మొదటి విడతలో 528 చదరపు అడుగుల విస్తీర్ణంతో 7,680 ఫ్లాట్ల నిర్మాణాన్ని ప్రభుత్వం చేపట్టనుంది. రాజేంద్రనగర్, మహేశ్వరం, శేరిలింగంపల్లి, ఖైరతాబాద్, కూకట్పల్లి, సనత్నగర్, మలక్పేట్ తదితర నియోజకవర్గాల్లో ఈ ప్రాజెక్టు అమలు కానుండగా, మిగిలిన ప్రాంతాల్లో కూడా అనువైన స్థలాల గుర్తింపును వేగవంతం చేయాలని సీఎం ఆదేశించారు.









