సోషల్ మీడియా సంచలనం, బిగ్బాస్ మాజీ కంటెస్టెంట్ అషు రెడ్డి (వెంకట అశ్విని రెడ్డి) తన ఎంగేజ్మెంట్ వార్తతో అందరినీ ఆశ్చర్యపరిచారు. ఒకవైపు కోట్లాది రూపాయల చీటింగ్ కేసులో చిక్కుకుని న్యాయపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో, ఆమె ఇన్ స్టాగ్రామ్ వేదికగా ఎంగేజ్మెంట్ రింగ్తో ఉన్న ఫొటోలను పంచుకోవడం సంచలనం సృష్టించింది. అయితే ఈ కీలక సమయంలో నిశ్చితార్థం ప్రకటించడం వెనుక అసలు కేసు నుంచి ప్రజల దృష్టిని మరల్చే ఎత్తుగడ ఉందా అనే అనుమానాలను నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు.
ఈ వివాదానికి ప్రధాన కారణం లండన్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్న వై.వి. ధర్మేంద్ర అనే ఎన్నారై ఇచ్చిన ఫిర్యాదు. పెళ్లి పేరుతో అషు రెడ్డి 2018 నుండి తన వద్ద సుమారు రూ.9.35 కోట్లు వసూలు చేసి మోసం చేసిందని ఆయన హైదరాబాద్ సీసీఎస్లో ఆరోపించారు. ఈ క్రమంలో అషు రెడ్డితో పాటు ఆమె తల్లిదండ్రులు, సోదరిపై కూడా పోలీసులు కేసు నమోదు చేయడం గమనార్హం.
ఈ కేసు దర్యాప్తుపై స్టే ఇవ్వాలని, తమపై కఠిన చర్యలు తీసుకోకుండా చూడాలని అషు రెడ్డి మరియు ఆమె తల్లి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించగా, కోర్టు అందుకు నిరాకరించింది. విచారణను నిలిపివేయాలన్న వారి అభ్యర్థనను తిరస్కరించడంతో ఆమెకు చట్టపరంగా ఎదురుదెబ్బ తగిలింది. అషు రెడ్డి ఎంగేజ్మెంట్ వార్తతో ఇప్పుడు ఆమె పెళ్లి చేసుకోబోయే వ్యక్తి ఎవరనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.









